శాసనమండలి ఎన్నికల ఓట్ల నమోదులో అధికార పార్టీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, వీటిపై అధికారులు విచారణ చేపట్టి బోగస్ ఓటర్లను తొలగించాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు ఆధ్వర్వాన నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, ఎన్నికల కమిటీ కన్వీనర్ ఎం.మోహన్రావు, సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ప్రసంగించారు. అధికార పార్టీ బలపర్చిన ఉపాధ్యాయ ఎంఎల్సి అభ్యర్థి, కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పి.చంద్రశేఖర్రెడ్డి ఓటర్ల నమోదులో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థలు, ఎన్.బి.కె.ఆర్ విద్యాసంస్థల లాంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నట్లు పేర్కొంటూ భారీ సంఖ్యలో అక్రమ పద్ధతిలో ఓటర్లుగా చేర్పించారని అన్నారు. కొన్ని దరఖాస్తుల్లో ఓటరు పేరు పురుషుడిగా నమోదు చేసి ఫొటోలు మాత్రం మహిళలవి ముద్రించి ఉన్నాయని తెలిపారు. అనర్హులను, ఎటువంటి సర్వీసూ లేనివారిని కౌంటర్ సంతకాలు లేకుండా ఓట్లగా నమోదు చేయించారని విమర్శించారు. మాంసం కొట్టులో పనిచేస్తున్న వారిని సైతం ఉపాధ్యాయ ఓటర్లుగా నమోదు చేయించారని తెలిపారు