భీమునిపట్నం -నర్సీపట్నం (బిఎన్ రోడ్డు )రహదారి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇవ్వడంతో కొత్తకోటలో బిఎన్ రహదారికి ఇరువైపులా ఉన్న నివాసితుల్లో గుబులు మొదలైంది. ఎప్పటి నుంచో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులుకు తీపి కబురు వచ్చింది. నర్సీపట్నం నుంచి సబ్బవరం వరకూ రహదారి విస్తరణకు ఆర్అండ్బి అధికారులు ఇప్పటికే సర్వే పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రభుత్వం న్యూడెవలప్మెంట్ బ్యాంకు(ఎన్డిబి) నుంచి రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేశారు. దీంతో విస్తరణ పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగానే రహదారికి రెండు వైపులా ఉన్న ఏళ్లనాటి చెట్లను ఇప్పటికే తొలగిస్తున్నారు. శిధిలమైన మదుముల నిర్మాణం చేపట్టారు . రహదారి విస్తరణకు సహకరించాలని పలు గ్రామాలలోఆర్అండ్బి శాఖ అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.